14, అక్టోబర్ 2010, గురువారం

                     పగటి కల (పుస్తక సమీక్ష )


రచయిత: గిజుభాయి బగేకా 
మూలం : దివా స్వప్న (గుజరాతీ)
అనువాదం : పోలు శేషగిరిరావు 
ప్రచురణ : హైదరాబాదు బుక్ ట్రస్ట్ 


కవర్ పేజీలు  : 
       మొదటి కవర్ పేజీ బ్లాక్ అండ్ వైట్ లో ఉపాధ్యాయుని చుట్టూ నిలబడ్డ విద్యార్థుల ఫోటో ఉంది .పుస్తకం పేరు బ్రష్ తో వ్రాసినట్లు ఉంది .అట్ట ఆకర్షణీయంగా లేక పోయినా ఆసక్తి రేకెత్తించేదిగా ఉంది.బాక్ కవర్ పై పుస్తకం లోని అంశం యొక్క లక్ష్యాన్ని తెలిపే విషయాల్ని క్లుప్తంగా ముద్రించారు.
ముందుమాటలు : 
       ఈ పుస్తకాన్ని చదివే ముందు మొదటి పేజీలలోని ముందు మాటలు తప్పక చదవాలి."గిజుభాయి ఒక స్వాప్నికుడు" అంటూ గిజుభాయి జీవితవిశేషాల్ని  ,విద్యా సంబంధమైన ఆయన కృషిని పరిచయం చేసారు.గిజుభాయి బగేకా మిత్రుడు హర్ భాయీ త్రివేదీ 'ఏమిటీ పగటికల' అంటూ పగటికలకు సంబంధించీ గిజుభాయి హృదయాన్ని ఆవిష్కరిస్తారు.  పుస్తకం లోని భావనల్ని ,విశేషాల్నిమనకు పట్టిస్తారు. 
       మొత్తం పుస్తకాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టారు గిజుభాయి . ప్రయోగం ప్రారంభం అనే శీర్షికతో నవల మొదలు  అవుతుంది.మొత్తం కథలో కథానాయకుడు లక్ష్మీ శంకర్ సాంప్రదాయ బోధనా పద్దతులను త్రోసి పుచ్చడం ,వాటిని అసహ్యించుకోవడం ,ప్రజాస్వామ్య పద్దతిలో బోధనను కొనసాగించడం,ఆ క్రమంలో విద్యార్థులనుండి,సమాజం నుండి ,అధికారులనుండి చివరకు సాటి ఉపాధ్యాయులనుండి ఎదురయ్యే సమస్యలను అత్యంత ఆత్మ విశ్వాసంతోనూ ,ప్రతిభావంతంగానూ ఎదుర్కొని తాను నమ్మిన తాత్విక ఆలోచనలకు ఆచరణాత్మక విజయాన్ని సాధించడమేగాక అందరి ప్రశంశలు అందుకోవడంతో ముగుస్తుంది.
       కథలో అడుగడుగునా ఉపాద్యాయుడు ఎదుర్కొనే సన్నివేశాలను హృద్యంగానూ ,ప్రతిభావంతంగానూ ,సహజంగానూ ,చిత్రిస్తాడు రచయిత . ప్రయోగ శీలియైన ఉపాధ్యాయుని అపజయాలను, విజయాలను కూడా హాస్యంతో మేళవించి మనముందు ఉంచుతాడు గిజుభాయి.అపజయాలకు కారణాలనూ సమీక్షిస్తాడు.విజయం సాధించడానికి కావలసిన సహనాన్ని పట్టుదలనూ,ప్రణాళికనూ అంతకు మించి బాలల పట్ల ప్రగాఢమైన ప్రేమను ఏ మోతాదులో ఉపాధ్యాయులు కలిగి ఉండాలో ఈ రచనలో తెలియ జేస్తాడాయన.
         గిజుభాయి విద్యార్థుల విషయంలో బోధన విషయంలో అభ్యుదయ కాముకుడుగా ఉండటమే కాదు సాంప్రదాయ పద్దతిలో పనిచేసే ఉపాధ్యాయుల పట్ల జాలి ,వారి వేతనాల విషయంలో అసంతృప్తీ కనబరుస్తాడు. వేతనాల పెంపుకోసం ఉద్యమాలు చేయండని సలహా కూడా ఇస్తాడు.ఈ సంఘటన కథలో సృష్టించడం ద్వారా ఆయన సామాజికంగా కూడా అభ్యుదయ భావజాలంతో ఉన్నాడని స్పష్టం అవుతుంది.
కథా క్రమం :
రచయిత, భావుకుడూ, అయిన లక్ష్మీ శంకర్ విద్యా శాఖ లోని ఉన్నతాధి కారి వద్దకు వెళ్లి ప్రాథమిక పాఠశాలలోని ఒక తరగతిని తన సిద్దాంతాలను ఆచరించే ప్రయోగంకోసం అడుగుతాడు.అధికారి మొదట నిరుత్సాహ పరిచినా ,అతని పట్టుదల చూసి ఒక సంవత్సరం పాటు ఒక పాఠశాలలో  నాల్గవ  తరగతిని అప్పగిస్తాడు .ఎటువంటి ప్రయోగాలు చేసినా కొలబద్ద మాత్రం పరీక్షలే అని హెచ్చరిస్తాడు ఆ అధికారి .
         తొలిరోజు  పాఠశాలలో అడుగు పెట్టిన లక్ష్మీ శంకర్ భావోద్వేగాలను ఇలా వివరిస్తాడు రచయిత.


"ఎప్పుడు పాఠశాల ప్రారంభ మవుతుందా ఎప్పుడు, క్లాసు బాద్యతను తీసుకొని ,పని ప్రారంభిద్దామా ,ఎప్పుడు నానూతన ప్రణాళికను అమలు పరుద్దామా,ఎప్పుడు  క్లాసులో క్రమ శిక్షణనూ , ప్రశాంతతనూ,నెలకొల్పుదామా,ఎప్పుడు రసవంతంగా బోధిద్దామా,ఎప్పుడు విద్యార్థుల మనస్సులను ఆకర్షిద్దామా,అని నేను ఆలోచిస్తున్నాను .బహుశా ఆ సమయంలో నా మెదడు లోని రక్తం కూడా అతి వేగంగా పరుగులు తీస్తూ ఉండవచ్చు అనుకుంటాను " ఇలా   సాగుతాయి అతని ఆలోచనలు .కానీ అతని అనుభవం అందుకు భిన్నంగా ఉండి,ఆకాశంలోని ఊహలు నేలమీదకు దిగుతాయి.విద్యార్థుల క్రమ శిక్షణా రాహిత్యం అతని తొలి రోజు ప్రణాళికను నాశనం చేస్తుంది .పాఠశాల మరో రెండు గంటలు నడువ వలసి ఉండగానే నాల్గవ తరగతికి సెలవు ప్రకటిస్తాడు .తనను అడుగకుండా సెలవు ప్రకటించినందుకు కోపం తెచ్చుకుంటాడు ప్రధానోపాధ్యాయుడు .        "మీరు చెబుతున్నట్లు ఆసక్తి గీసక్తి ,అవధానం గివధానం అన్నీ కట్టి పెట్టండి .ప్రాథమిక పాఠశాల పిల్లలు చెంపదెబ్బ పడితేనే చెప్పినట్లు వింటారు .అందరూ నియమ పూర్వకంగానే చదివిస్తున్నారు .మీరుకూడా ఆ దారిలో బోధిస్తేనే సంవత్సరాంతానికి సత్ఫలితం కనిపిస్తుంది .మీ ప్రయోగం తో వాళ్ళముందు నవ్వుల పాలయ్యారు .పైగా ఒక రోజు కూడా నష్టపోయారు "     అంటాడు ప్రధానోపాధ్యాయుడు .
          ఇక లక్ష్మీ శంకర్ తను తొలి రోజు చేసిన పొరపాటు ఏమిటో సమీక్షించుకొని ,రెండవ రోజు కథలతో మొదలెట్టి విద్యార్థుల అభిమానాన్ని గెలుచు కుంటాడు .ఆ క్రమంలో వారికి శ్రద్దగా కూర్చోవడం ,పరిశుభ్రంగా ఉండటం ,క్రమశిక్షణ ,ఆదర్శ పఠనం ,ఉక్తలేఖనం మొదలైనవన్నీ నేర్పుతాడు .
         పిల్లలు మురికి టోపీల్తో రావడం చూసి వాటిని లేకుండా వచ్చేందుకు అనుమతి ఇవ్వమని కోరితే సమాజానికి వ్యతిరేకంగా నేనేమీ చేయలేనంటాడు .కాస్త లౌక్యంగా వ్యవహరించ మంటాడు.టోపీలు లేకుండా పాఠశాలకు రావడానికి తల్లి దండ్రులు అనుమతించక పోగా "మీ పంతులుకు పిచ్చి పట్టిందా ఏమిటి?"అని అడుగుతారు .ఒక రోజు విద్యార్థులకు ఆటలు నేర్పబోతే ఒకడి కొకడు తల పగుల గోట్టుకుంటారు .ఉపాద్యాయులూ ,ప్రదానోపధ్యాయుడూ ,మరోసారి లక్ష్మీశంకర్ కు బుద్ధి చెప్పేందుకు పూనుకుంటారు .
         "ఏమిటండీ ఈ ఆటలూ,పాటలూ మానేయ్యండి ? వీళ్ళు భయ భక్తులు లేకుండా పెరిగిన జనం .వట్టి పోకిరీ మూక .వీళ్ళను పాఠశాలలో  బంధించి  ఉంచాలి .చదివించాలి .వల్లే వేయిచాలి .అలా చేయండి .వీళ్ళను స్వేచ్చగా వదిలేస్తే ఒకరి తల ఒకరు పగులగొట్టు కుంటారు .రోజూ వీధులలో ఎం జరుగుతున్నదీ మీకుమాత్రం తెలియదూ" అంటాడొక ఉపాధ్యాయుడు .
       తల్లి దండ్రుల సమావేశం పెడితే ఆహ్వానాలు 40 మందికి హాజరు 7 గురు .ఉపన్యాసం పూర్తయ్యేసరికి ఇద్దరు ,చివరికి ,ఉపాధ్యాయులూ ,ఉన్నతాదికారీ మిగులుతారు .
      ఒకరోజు డైరెక్టర్ గారి విజిట్ జరుగుతుంది .ఆయన విజిట్ నుండి తన క్లాసును మినహాయించ  మంటాడు లక్ష్మీశంకర్ .ప్రధానోపాధ్యాయుడు ఉన్నతాధికారికి పిర్యాదు చేస్తాడు.ఉన్నతాదికారితో మాట్లాడిన తర్వాత నాల్గవ విద్యార్థులతో ఒక కార్యక్రమం ఏర్పాటుకు ఒప్పుకుంటాడు లక్ష్మీశంకర్ .ఆ రోజు నాల్గవ తరగతి పిల్లలు అత్యంత సహజంగా అత్యంత క్రమశిక్షణతో నాటికలను ప్రదర్శిస్తారు .దీన్ని చూసిన డైరెక్టర్ లక్ష్మీశంకర్ ను మెచ్చుకొని ,తన ప్రయోగాలను మున్డుకుతీసుకొని పొమ్మంటాడు .తన ప్రయోగాలు గుర్తింపుకు నోచుకున్నందుకు మొదటి సారి ఆనంద పడతాడు లక్ష్మీ శంకర్ .
      తనదైన పద్దతిలో వ్యాకరణం ,భూగోళం ,చరిత్ర మొదలైన విషయాలు నేర్పి ,ఆరునెలల పరీక్షకు తయారు చేస్తాడు .పరీక్షలన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటాయి .ఉన్నతాధికారి విద్యార్థుల ప్రతిభ చూసి  ఆశ్చర్య పడతాడు .లక్ష్మీ శంకర్ ను తనింటికి పిలి పించుకుని వివిధ విషయాలను విద్యార్థులకు నేర్పే పద్ధతి తెలుసుకొని అభినందిస్తాడు .ఉపాధ్యాయులు సానుకూలంగా మాట్లాడినా తాము ఆ విధానాలను అవలంభించడం లో గల కష్ట నష్టాలను తెలియజేస్తారు .జీతాలు తక్కువగా ఉన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు పోరాడాల్సిన ఆవస్యకతనూ లక్ష్మీ శంకర్ ఉపాధ్యాయులకు తెలియజేస్తాడు .
       వార్షిక పరీక్ష లో విద్యార్థులూ .లక్ష్మీ శంకర్లు కూడా ప్రశంసలు పొందడంతో నవల ముగింపు జరుగుతుంది .కదా గమనం పాఠకులను తనతో పాటు తీసుకు పోతుంది .ఉపాధ్యాయులు నిత్యం అనుభవిస్తున్న బోధనా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుంది .ప్రజా స్వామ్య పద్ధతి లో విద్యార్థులకు బోధించే మార్గాన్ని వివరిస్తుంది .ఉపాధ్యాయులైన వారు ప్రేరణ పొందేందుకు  చదవాల్సిన పుస్తకం గిజుభాయి వ్రాసిన పగటికల 
       తన కలను నిజం చేయగల భావితరం ఉపాధ్యాయులకోసం ఈ పగటి కలను కంటాడు గిజుభాయి .సుమారు 80 ఏండ్ల వయసున్న ఈ కలను ఈనాటి ఉపాధ్యాయులైన మనం నిజం చేయాల్సి ఉంది

2 కామెంట్‌లు:


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248