14, అక్టోబర్ 2010, గురువారం

                            శారీరక దండన లేకుండా బోధన సాధ్యం కాదా ?


            శారీరక దండన లేకుండా బోధన సాధ్యంకాదా ? అనే ప్రశ్న ఈనాడు మన ఉపాధ్యాయులంతా తప్పని సరిగా వేసుకోవాల్సి వస్తుంది . ఎందుకంటే  ఇటీవల ఉపాధ్యాయులలో కొందరు , విద్యార్థులకు విధిస్తున్న శిక్షలు మానవతా పరిధిని దాటుతున్నాయి .ఆ కొద్ది మంది చేసిన నిర్వాకం వారి పాల బడ్డ విద్యార్థుల దృష్టి లో ఉపాధ్యాయులను రాక్షసులుగా చూపిస్తోంది కాబట్టి .ఆ కొద్ది మంది చేసిన నిర్వాకం మీడియా సహకారంతో సమాజం ముందు ఉపాధ్యాయులందరినీ దోషులుగా నిలబెడుతోంది కాబట్టి.
            ఒక ఉపాధ్యాయుడు,ఆలస్య మైనందుకు విద్యార్థుల చేత 600 ల గుంజీలు తీయించాడు .గుజీలు తీసిన 40 మందీ హాస్పిటల్ పాలవడమే కాక అందులో 20 మందీ గుంజీలు తీస్తూనే స్పృహ తప్పి పడిపోయారు.ఇంతకూ వారు ఆలస్యమైంది కేవలం రెండు నిముషాలు.
           తరగతి గదిలో అల్లరి చేసినందుకు ఒక ప్రదానోపాధ్యాయురాలు 11 మంది విద్యార్థులకు పొయ్యిలో కాలుతున్న వంటచెరుకుతో వాతలు పెట్టారు.ఆడుకుంటూ ఎల్ కే జీ విద్యార్థులపై పడ్డారని మరొక ఉపాధ్యాయుడు బెత్తంతో 5 గురు విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టాడు .
          మొదటి సంఘటన ఆదిలాబాద్ ,మిగతా రెండు వరంగల్ లో జరిగాయి .మొదటి రెండూ ప్రభుత్వ పాఠశాలలు మూడవది ప్రైవేటు పాఠశాల  మొదటి సంఘటనా, మూడవ సంఘటనల్లో ఉపాధ్యాయులు పురుషులైతే రెండవ సంఘటనలో స్త్రీ .ఈ రకమైన ఘటనలలో  జిల్లాల ఎల్లలు లేవు .ప్రభుత్వ ప్రైవేటు తేడాలు లేవు .స్త్రీ పురుష భేదాలు కూడా లేవు .
          తరగతి గదిలో ఆడు కుంటున్నందుకు 16 ఏండ్ల అమ్మాయిని ఓ పంతులమ్మ చితగ్గొడితే ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది .ఆవిడ  చేతిలోనే మరో ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కొల్పోయారట గతంలో .ఇవన్నీ చూసిన తర్వాత శారీరక దండన లేకుండా బోధన సాధ్యం కాదా అనే ప్రశ్న వేసుకోవాలనిపించడం లేదూ?
          నిజానికి దండనకు సంబంధించి కేవలం ఉపాధ్యాయుడిని మాత్రమే నిందించడం సరికాదని మనకు తెలుసు .దీనికి అనేక వ్యవస్థాగత ,సామాజిక ,కారణాలున్నాయి .ప్రభుత్వం గానీ, ప్రైవేటు యాజమాన్యం గానీ వ్యవస్థాగత కారణాలను ఏమాత్రం సరి చెయ్యక పోగా మరింత పెంచుతుంది .పాఠశాలలో తగినన్ని గదులు లేక పోవడం ,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి సరిగా పాటించక పోవడం ,బండెడు సిలబస్ ,పుస్తకాల పంపిణీ లో తీవ్రమైన ఆలస్యం ,పరీక్షలకై పరుగులేత్తించడం ఇవన్నీ ఉపాధ్యాయుడిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి .ఆ ఒత్తిడి విద్యార్థికి దండన రూపంలో బదిలీ అవుతుంది .
         పిల్లలు అల్లరి చేయడం ,ఆడుకోవడం సహజమనే అధికారులే ,వారు ఏదైనా పాఠశాలను పర్యవేక్షణకు వెళ్లి నప్పుడు అంతా ప్రశాంతంగా ,నిశ్శబ్దంగా ఉంటే గొప్ప పాఠశాలగా కీర్తిస్తారు .వారిని అలా ఉంచేందుకు ఉపాధ్యాయులు ఏ పద్దతిని అనుసరిస్తున్నారో గమనించరు.ఒకటి కోరుకుంటూ ,మరొకటి చెప్పడం అధికారులకు అలవాటే .విద్యావేత్తలందరూ ర్యాంకుల కోసం గొంతులు కోసుకునే పోటీ సరైంది కాదని చెబుతూంటే ,రాజీవ్ విద్యా మిషన్ వారు తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారి ఫోటోలను నోటీసు బోర్డుపై ఉంచాలని ,సబ్జెక్టు  వారీ గ్రాఫును ప్రదర్శించాలనీ అతి పొడవైన గ్రాఫుకోసం ఉపాధ్యాయులను పోటీ పదమనీ చెబుతున్నారు .
          ఈ రకమైన ఫలితాలకోసం ఉపాధ్యాయులు దండనను ఆశ్రయించే అవసరాన్ని పెంచుతున్నారు.ఏది ఏమైనా విద్యార్థి తీవ్ర దండనకు గురైతే రిజల్ట్ కావాలనే ప్రభుత్వం గానీ తల్లిదండ్రులు గానీ ఉపాధ్యాయుడినే నిందిస్తారు .కాబట్టి శారీరక దండన లేకుండా విద్యార్థికి బోధించలేమా? అనేది ఉపాధ్యాయునికి సంబంధించినంతవరకూ ఒక మౌలిక ప్రశ్న అవుతుంది .
         అందరు ఉపాధ్యాయులూ విద్యార్థులకు తీవ్రమైన భౌతిక దండనలు విధించాలని అనుకోరు .కానీ,అసలు బెదిరించకపోతే ఎలా ? అనో ,చిన్నగా దండించడం వల్ల నష్టం ఉండదనో ,దండిచకపోతే చదువెలా వస్తుందనో ,నేను మాపెద్దలు ,టీచర్ల చేతిలో శిక్షించ బడటం వల్లనే ఇంతవాడినయ్యాననో వంటి కొన్ని అభిప్రాయాలుంటాయి .ముఖ్యంగా భారతదేశం లో దేవునికంటే ముందు స్థానం గురువుకే కట్టబెట్టారు .ఆయన అధికారాల్ని ప్రశ్నించే హక్కు సమాజంలో ఎవరికీ ఉండేది కాదు .
          కానీ సమాజం మారింది .నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం వైపు ప్రయాణం చేస్తున్నాం .అది పాఠశాల తరగతి గదుల్లోనే వికసించాల్సి ఉంది .కలకత్తాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ దండిస్తే భయపడిన విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు .ప్రిన్సిపాలును కోర్టు బోనులో నిలబెడితే ,విద్యార్థిని దండించడం తప్పనే విషయమే తనకు తెలియదన్నాడు .మనకు తెలిసినా ,తెలియక పోయినా చట్టం తనపని తాను చేసుకు పోతుంది .ఈ తరుణం లో శారీరక దండన లేకుండా విద్యార్థికి బోధించలేమా ? అనే ప్రశ్న ఉపాధ్యాయుడు వేసులోవాలి.
           విద్యార్థిని దండించే విషయం లో ఉపాధ్యాయుడు తనవైపు నుండి ఉండే కారణాలను ఆత్మవిమర్శతోనూ ,ఆత్మనిగ్రహం తోనూ ,సవరించుకోవాలి .దండన ఉపయోగించే అంశాలైన గైర్ హాజరు,క్రమ శిక్షణ,క్లాసులో పాఠము పై దృష్టి కేంద్రీకరించక పోవడం ,సమాధానాలు చెప్పక పోవడం ,చదవక పోవడం ,హోం వర్కు చేయక పోవడం ,పరీక్షలు సరిగా వ్రాయక పోవడం వంటి అనేక సమస్యలను లోతుగా విశ్లేషించ గలిగితే విద్యార్థిని దండించే పరిస్థితినుంచి ఉపాధ్యాయుడు తప్పుకోగలుగుతాడు.ఈ విశ్లేషణ చాలా సహనం తోటీ విద్యార్థిపై చాలినత ప్రేమ తోటీ జరగాలి .వీటి వెనుక విద్యార్థి నేపథ్యం ,సామాజిక ,ఆర్ధిక కారణాలు దాగుంటాయి .వాటిని మనం అర్థం చేసుకుంటే విద్యార్థిపై కోపానికి బదులు జాలి కలుగవచ్చు .తద్వారా వాటిని మూలాల్లోంచి తొలగించేందుకు కృషి చేయవచ్చు .
          పైన ఉదాహరిచిన అన్ని సందర్భాలలోనూ దండించే తీవ్రత ఒకేలా ఉండదు .అలాగే ఒకే తప్పుకు వేర్వేరు ఉపాధ్యాయుల ప్రతిస్పందన కూడా వేర్వేరుగా ఉంటుంది .దీనికి కారణాలు ఉపాధ్యాయుని మూర్తిమత్వంలో ఉంటాయి .ఉపాధ్యాయులలోని గుణ దోషాలే తీవ్ర శారీరక దండనలకు కారణం అవుతాయి.వాటిలో కొన్నింటిని ప్రస్తావించుకుందాం .
        కోపం 
       కొంతమడికి కోపం ఎక్కువగా ఉంటుంది .దానికి కారణం వారి కుటుంబ నేపథ్యం కావచ్చు ,ఆరోగ్య పరిస్థితి కావచ్చు.వారెంత వారైనా కోప లక్షణం ఉన్నవారు తమ చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు కోల్పోతారు .కోపం ఒక మానసిక బలహీనత .దీన్ని తొలగించుకోక పోతే ఏ విద్యార్తులకోసమైతే ఉపాధ్యాయులు బోధిస్తున్నారో వారికే ఉపాద్య్హాయుల  పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుంది .మనకు కోపం వచ్చిన ప్రతిసారీ దాన్ని ఎవరి మీద బడితే వారి మీద ప్రదర్సించం .దాన్ని బలహీనులపైనే తేలిగ్గా ప్రదర్శిస్తాం .అలా అనుకున్నప్పుడు గతంలో వలె విద్యార్థి బలహీనుడు కాదని మనం అర్థం చేసుకోవాలి.చట్టం ,రాజ్యాగం ఈనాడు విద్యార్థికి మద్దతు ఇస్తోంది .
       అహం 
       ఇది సమాజం లో వేళ్ళూనుకుని ఉన్న భూస్వామ్య( ఫ్యూడల్ ) భావజాలం నుంచి సంక్రమిస్తుంది .యజమాని శ్రామికునికన్నాగొప్ప వాడనుకుంటాడు .భర్త,భార్యాకన్నా గొప్ప వాడనుకుంటాడు .పోలీసు నేరస్తుడిని ఏ విధంగానైనా శిక్షించ వచ్చు నను కుంటాడు.అదే విధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థిపై సర్వ హక్కులూ ఉన్నాయనుకుంటాడు.ఆ అదికారం ప్రశ్నించ బడినప్పుడో ,ఆదేశాలు పాటించ బడనప్పుడో విద్యార్థిని శిక్షించ బూనుకుంటాడు .భయోత్పాతం సృష్టించి గౌరవం పొందాలనుకుంటాడు .దీన్ని మనం సరి చేసుకుని ఆత్మగౌరవం గల విద్యార్థిని దేశానికి అందించాలి .ఎదుటివారి ఆదేశాల్ని గుడ్డిగా పాటించేవారిని కాదు .
        ఉపాధ్యాయుని సంసిద్దత 
        ఉపాధ్యాయుడు బోధనకు సరైన ప్రణాళిక తో తయారు కాకపోవడం కూడా తరగాతి గదిలో క్రమశిక్షణా రాహిత్యానికి ,ఆపై దండనవిధించే పరిస్థితులకూ కారణం అవుతుంది .తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధన విద్యార్థిని మమేకం చెసేదిలా ఉండాలి .
         సరైన  స్వరం 
         బోధించే సమయం లో కొందరు ఉపాధ్యాయులు పెద్ద గొంతు తో అరచి బోధిస్తారు.అలా చెప్పడం సరైనదిగా భావిస్తారు .పెద్ద గొంతు ఆధిక్యతకు చిహ్నం గా భావిస్తారు.కానీ అది సరికాదు .అలా చేయడం వల్ల ఉపాధ్యాయుని స్వరమే తప్ప సారాంశం చెవికి చేరదు .ఆసక్తి తగ్గి అల్లరి మొదలు పెడతారు .ఉపాధ్యాయుడు మరింతగొంతు పెంచాల్సి వస్తుంది .ఇది ఉపాధ్యాయుని ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తుంది.చక్కని స్థాయిలో విద్యార్థులను ఆకట్టుకునే స్వరంతో బోధన జరిపితే క్రమశిక్షణా రాహిత్యానికి అవకాశం తగ్గి దండన అవసరం తగ్గుతుంది .
       ఆరోగ్యం 
     మానసికంగా ,శారీరకం గా ,ఆరోగ్యంగా ఉండే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాడు .అటువంటి స్థితిలో దండన అవసరం దాదాపుగా ఉండదు .దీనికోసం ఉపాధ్యాయుడు ప్రతీ రోజూ తన ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించాలి .ఆరోగ్యానికి చెరుపు చేసే అలవాట్ల నుండి దూరంగా ఉండాలి.సమతులాహారం తీసుకోవాలి .తగినంత విశ్రాంతి తీసుకోవాలి .డా .సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా ఈవిషయం లో తీసుకోవచ్చు.ఆయన రాత్రి 10 గంటలు దాటితే ఎట్టి పరిస్తితిలోనూ మేల్కొని ఉండేవారు కాదు రష్యా లో రాయబారిగా ఉన్నప్పుడుకూడా తన అలవాటును మార్చుకోలేదు .సాక్షాత్తూ కా .స్టాలిన్ కూడా తన సమావేశాలను ఆయన కోసం సర్దుబాటు చేసుకునేవారు .
        కుటుంబ జీవనం 
       ఉపాధ్యాయుని కుటుంబ జీవనం ,పరిస్థితులు తరగతి గదిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది .ఉపాధ్యాయుని కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ,ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి .కుటుంబ సభ్యులతో తన ప్రవర్తనను దానికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవాలి .ఒకవేళ ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాకూడా పాఠశాలలోకి దాని ప్రభావం రాకుండా చూసుకోవాలి .
    అధ్యయనం 
          ఉపాధ్యాయ వృత్తి లో అధ్యయనం నిరంతర స్రవంతిలా ఉండాలి.అనేక వృత్తుల వారు వారి వారి వృత్తుల్లో వచ్చిన పాత కొత్త విషయాలను అధ్యయనం చేస్తుంటారు .అలాగే ఉపాధ్యాయులు శారీరక దండన లేకుండా బోధించే విషయాలను తెలుసుకునేందుకు నిరంతరం అధ్యయనం చేయాలి .దండనను విడచి పెట్టేందుకు అవసరమైన అనుభవాలను నిక్షిప్తం చేసిన అనేక పుస్తకాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి .వాటిని చదివి ఆచరణలో పెట్టడం ద్వారా దండన నుండి దూరంగా జరుగవచ్చు .డా .చుక్కా రామయ్య గారు వ్రాసిన రామయ్య జ్ఞాపకాలు ,గిజుభాయి సమగ్ర సాహిత్యం ,సుహోమ్లీన్ స్కీ వ్రాసిన "పిల్లలకే నా హృదయం అంకితం ,రైలు బడి ,సమ్మర్ హిల్ అనుభవాలు ,చలం వ్రాసిన బిడ్డల పెంపకం వంటి పుస్తకాలు మన బోధనను సుసంపన్నం చేస్తాయి.గిజుభాయి సమగ్ర సాహిత్యం మొదటి సంపుటిలో విద్యార్థుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ,వాటికి సరైన నివారణోపాయాలు పట్టిక రూపంలో ఇవ్వ బడినాయి .


         ఈనాడు భౌతిక దండనను అనేక దేశాలు ,మనదేశంలో అనేక రాష్ట్రాలు నిషేధించాయి .అయినా తరుచుగా విద్యార్థులపై విధింపబడే అమానుష శిక్షల గురించి వింటూనే ఉన్నాము .అనేక చట్టాలు ,రాజ్యాంగము ,సమాజంలో అత్యంత బలహీనుడైన విద్యార్థికి అండగా ఉన్న ఈ తరుణంలో ఉపాధ్యాయులు vidyaarthi  పట్ల మరింత ప్రేమతోనూ ,సహనంతోనూ ,జాగరూకతతోనూ వృత్తిని నిర్వహించాలి.ప్రతిరోజూ  పాఠశాలకు వెళ్ళే సమయంలో శారీరక దండన లేకుండా విద్యార్థికి  బోధించలేమా ? అని ప్రతి ఉపాధ్యాయుడూ తననుతాను ప్రశ్నించుకోవాలి.

1 కామెంట్‌:

  1. కోపం, అహం, స్వరం, ఆరోగ్యం, జీవనం, అద్యయనం .......... ఇవేవి లేకపోయినా కూడా ...... ప్రతి ఉపాద్యాయుడు కూడా మనసు నిండా ఆప్యాయత నింపుకుని ప్రతి విద్యార్ధి పట్ల నేను సమాజానికి, దేశానికి మంచి అవసరపడే వ్యక్తిని, శక్తిని ఇవ్వగగలనని ఆ లోచించిన రోజున తప్పకుండా శారీరక దండన లేకుండా బోధన సాద్యపడుతుంది.

    రిప్లయితొలగించండి


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248